Monday, 12 November 2018

గర్భవతినని ప్రచారం చేశారు!



తెలుగులో గ్లామర్‌ తారగా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. ఇక్కడ అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లింది. ‘బర్ఫీ’తో అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొంది. ఆ తర్వాత తెలుగువైపు తిరిగి చూడలేదు. ఆరేళ్ల తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ చిత్రం ఈ నెల 16న విడుదలవుతున్న సందర్భంగా ఇలియానా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...


చాలా రోజుల తర్వాత తెలుగులో సినిమా చేశారు. ఇన్నాళ్లూ తెలుగు నుంచి అవకాశాలు రాలేదా? మీరు ఒప్పుకోలేదా? 

అవకాశాలు చాలానే వచ్చాయి. కొన్ని కథల్లో పాత్రలు నచ్చక, కొన్నిసార్లు బాలీవుడ్‌లో ఒప్పుకొన్న సినిమాల వల్ల ఇక్కడ నటించడం కుదరలేదు. తెలుగులో కెరీర్‌ ఆరంభించిన తర్వాత ఎలాగైతే వరుస అవకాశాలు వచ్చాయో, అలాగే బాలీవుడ్‌కి వెళ్లగానే అక్కడ అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఇంత విరామం వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు.
అంతేనా... లేదంటే బాలీవుడ్‌కే పరిమితం కావాలనుకొన్నారా? 

నేనైతే అస్సలు అలా అనుకోలేదు. తెలుగులో నటించడమన్నా, హైదరాబాద్‌లో గడపడమన్నా నాకు చాలా ఇష్టం. కానీ చాలామంది ‘ఇలియానా ఇక్కడ నటించదట’ అని మాట్లాడుకొన్నారు. నేనెందుకు అలా అనుకొంటాను? అయితే తెలుగు నుంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఓ మంచి చిత్రంతోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొన్నా. అందుకే మంచి కథ వచ్చేవరకు ఎదురు చూశా.


అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లో మీకు నచ్చిన అంశం ఏంటి? 

కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్ర చాలా బాగుంటుంది. అందులో పలు పార్శ్వాలు కనిపిస్తాయి. అమర్‌, అక్బర్‌, ఆంటోనీ అనే మూడు పాత్రలతో నా పాత్రని ముడిపెట్టిన విధానం బాగుంటుంది. అదెలా అన్నది తెరపైనే చూడాలి. నా కెరీర్‌లో ఇలాంటి పాత్రని చేయడం ఇదే తొలిసారి. నటించడానికి మంచి అవకాశం లభించింది. అదే సమయంలో వాణిజ్యాంశాలు కూడా ఉంటాయి. ఈ సినిమాని పిల్లల దగ్గర్నుంచి, పెద్దల వరకు అందరూ చూడొచ్చు. రవితేజ మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి నటించడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది.


పరిశ్రమకి వచ్చిన తొలి రోజులతో పోలిస్తే ఇప్పుడు మీలో మీకు కనిపిస్తున్న మార్పులేంటి? 

అప్పుడు నేను చిన్నమ్మాయిని. అప్పుడు 20 ఏళ్ల ఇలియానాని. ఇప్పుడు 32 ఏళ్లు. అందుకు తగ్గట్టుగానే నా వ్యక్తిత్వంలో చాలా మార్పులొచ్చాయి. కథల్ని ఎంపిక చేసుకొనే విధానంలోనూ, చుట్టూ ఉన్నవాళ్లతో నడుచుకొనే విధానంలోనూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. చేసే పనిని ఎప్పుడైతే గౌరవించడం మొదలుపెడతామో అప్పట్నుంచి మన ఆలోచనలే మారిపోతాయి. తొలినాళ్లలో నాకు ఇన్ని విషయాలు తెలిసేవి కాదు. ‘దేవదాస్‌’ సినిమా సమయంలో క్లాప్‌బోర్డు తీసుకొచ్చి ముందు క్లాప్‌ కొడితే ‘ఇలా ఎందుకు చేస్తారు?’ అని అడిగేదాన్ని. ఆ రోజులు తలచుకొంటే నవ్వొస్తుంది. కానీ క్రమంగా పనిపై ప్రేమ పెరిగింది. నేను చేసిన తప్పుల్నుంచే కొత్త విషయాలు నేర్చుకొన్నా.


పరిశ్రమలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? 

అప్పట్లో సినిమా ప్రచారం ఇంత ఉద్ధృతంగా ఉండేది కాదు. నా తొలి సినిమా ‘దేవదాస్‌’ తర్వాత ఎక్కువగా ఏ సినిమాకీ ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు వాతావరణం మారింది. బాలీవుడ్‌లో అయితే ప్రతి సినిమాకీ నెల రోజులపాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగులో వచ్చిన ఈ మార్పు మంచిదే. అప్పట్లో అగ్ర కథానాయకులు బయటికి వచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు బయటికొచ్చి మాట్లాడటం బాగుంది. రవితేజ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు (నవ్వుతూ).



తొలిసారి మీ పాత్రకి మీరు డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. అది మీ నిర్ణయమేనా? 

దర్శకుడు శ్రీనువైట్లకి నాపై ఉన్న నమ్మకం వల్లే అది సాధ్యమైంది. మొదట నన్ను నిర్మాతలు అడిగారు. కానీ నేను చేయలేనని చెప్పా. తెలుగు చిత్ర పరిశ్రమకి దూరమై ఆరేళ్లవుతునప్పటికీ నాకు భాష మాత్రం బాగానే అర్థమవుతుంది. కానీ పదాలు పలికే విధానంలోనే తప్పులు దొర్లుతుంటాయి. అది వినేవాళ్లకి ఏమాత్రం బాగుండదనేది నా అభిప్రాయం. అందుకే తెలుగులో ఎప్పుడూ డబ్బింగ్‌ చెప్పే ధైర్యం చేయలేదు. నా జీవితంలో తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకొంటానని ఎప్పుడూ అనుకోలేదు.


మీకు పెళ్లయిందనే మాటలు వినిపించాయి. దాని గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలో నిజమెంత?
నేను గర్భవతిని అని కూడా ప్రచారం చేశారు కదా! (నవ్వుతూ). వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూనే ఉన్నా. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? నా పెళ్లి, నిశ్చితార్థం, బంధం... ఇలాంటి విషయాల గురించి మాట్లాడే ఉద్దేశం లేదు.


మీ స్నేహితుడు ఆండ్రూ నీబోన్‌తో బంధం గురించి ఏం చెబుతారు మరీ?
తనతో బంధం విషయంలో సంతోషంగా ఉన్నా. అంతవరకూ చెబుతాను.


‘మీ టూ’ ఉద్యమంపై మీ స్పందన ఏంటి? మీకు పరిశ్రమలో ఏమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
నా అనుభవాల్లోకి వెళ్లదలచుకోలేదు. కానీ ‘మీ టూ’ వేదికగా ఎంతోమంది మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకి ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతున్నారు. అది మంచి మార్పుకి దారి తీస్తుంది. సినిమాల్లోనే కాదు, ప్రతి పరిశ్రమలోనూ మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వేధిస్తుంటారు. వాళ్ల చేదు అనుభవాల గురించి మాట్లాడటం ఎంతో బాధతో కూడుకొన్న విషయమే. అలాగని మౌనంగా ఉండకూడదు. ‘మీ టూ’ ఉద్యమం వల్ల చాలాచోట్ల కమిటీల్ని ఏర్పాటు చేసి మహిళలకి రక్షణగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పరిణామం కదా.


ఆ మధ్య మానసిక పరమైన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్టు వార్తలొచ్చాయి. నిజమేనా?
అది నిజమే. చాలామందికి ఎదురవుతున్న సమస్య ఇది. కారణాలేమీ ఉండేవి కాదు కానీ వారం రోజులపాటు ఇంట్లో నుంచి బయటికొచ్చేదాన్ని కాదు, ఎవ్వరినీ కలిసేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. కానీ నాకు నేను దాని గురించి తెలుసుకొని బయటపడ్డా. ఆ సమస్య నన్ను మానసికంగా మరింత బలంగా చేసిందని నమ్ముతాను.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top