‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకొనేలా చేశారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అపూర్వ విజయం సాధించాయి. భారీ స్థాయి వసూళ్లు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచాయి. ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన రాజమౌళి తదుపరి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎవరితో చేయబోతున్నారు? అనే విషయాలపై చర్చ మొదలైంది. ప్రేక్షకుల్లో నెలకొన్న ఆ ఆసక్తి, ఆత్రుతకు తెరదించుతూ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఇక అందులో అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, రామ్చరణ్ కలసి నటిస్తున్నారనేసరికి ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రామారావు రామ్చరణ్ రాజమౌళి (ఆర్ ఆర్ ఆర్) అనే అర్థం వచ్చేలా వర్కింగ్ టైటిల్ని నిర్ణయించారు. ఈ భారీ చిత్రాన్ని 11వ నెల 11వ తేదీ 11 గంటలకి ప్రారంభిస్తామని ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం హైదరాబాద్లో అట్టహాసంగా చిత్రం ప్రారంభమైంది.
డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథా నాయకుడు చిరంజీవి క్లాప్నిచ్చారు. వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించి, స్క్రిప్టుని చిత్రబృందానికి అందజేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయిలో చాటిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండడం ఓ కలలా ఉంది. మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకొనేలా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారని తెలుసు. అందుకు తగ్గట్టుగానే చిత్రం ఉంటుంది. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో కథానాయకుల నేపథ్యంలో రెండు వారాల పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రంలోని ఇతర నటుల గురించి త్వరలోనే ప్రకటిస్తామ’’న్నారు. ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్వైజర్: శ్రీనివాస్ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: సాబుసిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్ కుమార్, సమర్పణ: డి.పార్వతి.
సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పలువురు తారలు సందడి చేశారు. కథానాయకులు ప్రభాస్, రానాతో పాటు కల్యాణ్రామ్ వేడుకలో పాల్గొన్నారు. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి, మెహర్ రమేష్తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్రాజు, ప్రసాద్ వి.పొట్లూరి, శోభు యార్లగడ్డ, శ్యామ్ప్రసాద్ రెడ్డి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కె.ఎల్.నారాయణ, డి.సురేష్బాబు, యు.వి.వంశీ, యు.వి.విక్రమ్, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, నవీన్ ఎర్నేని, సి.వి.మోహన్, యలమంచిలి రవిశంకర్, పరుచూరి ప్రసాద్, ఎన్.వి.ప్రసాద్, సాయి కొర్రపాటి, గుణ్ణం గంగరాజు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
0 comments:
Post a Comment